శీర్షిక చదివితే, పరస్పర సంబంధం ఏమాత్రమూ లేని రెండు అంశాలుగా అనిపిస్తాయి మహిళా సాధికారత - ఉమ్మడి పౌరసత్వం అనే విషయాలు. ఈ నేపథ్యంలో, ఆయేషా సిద్దిఖీ కేసు ఓ సారి పరిశీలించినప్పుడు మహిళా సాధికారత అనేది, ఉమ్మడి పౌర చట్టంతో ఎలా సాధ్యమనేది కూడా మంచి చర్చకు దారితీస్తుంది.
మరో వివాహానికి ముందుగా, తనకు విడాకులు ఇవ్వాలని ఆయేషా కోరింది. అసలు పెళ్ళే కాలేదు పొమ్మన్నాడు షోయబ్ మలిక్. జరిగిన పెళ్ళికి సాక్ష్యంగా, అతను సంతకం చేసిన వివాహ పత్రాలు బయట పెట్టింది ఆయేషా. అది తన సంతకమే అని ఒప్పుకున్నా, ఫోనులో జరిగిన వివాహం చెల్లదని తేల్చి చెప్పాడు షోయబ్. దీన్నిబట్టి, ఫోనులో చేసుకున్న పెళ్ళి చెల్లదని తెలిసే షోయబ్ పెళ్ళి చేసుకున్నట్లు అర్ధమౌతుంది. అంటే, స్త్రీని ఓ విలాస వస్తువుగా మాత్రమే భావించే అతని మనస్తత్వం బట్టబయలయ్యింది. తప్పనిసరి పరిస్థితుల్లో, పెళ్ళి పిమ్మట జరిగిన మరికొన్ని సంఘటనలకు సాక్ష్యంగా ఫోరెన్సిక్ విభాగానికి ఆధారాలు అందజేసింది ఆయేషా. ఇక, రాజీపడక తప్పని పరిస్థితుల్లో విడాకుల మీద సంతకం చేసాడు షోయబ్. నెలకు అయిదువేల చొప్పున, మూడు నెలలకు పదిహేనువేల భరణాన్ని కూడా ఇచ్చాడు.
చూడబోతే, ఆయేషా సంపన్న కుటుంబానికి చెందిన మహిళగా తెలుస్తోంది. అదే పరిస్థితుల్లో, ఓ సాధారణ ముస్లీం మహిళను, ఈ దేశ ముస్లీం పౌరుడుని ఊహించుకోండి. మూడు నెలల భరణం ఇచ్చేస్తే, ఆ మహిళకు జీవితాంతం వరకు సరిపోతుందా? ఇవన్నీ, ముస్లీం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన విషయాలని కొట్టిపారేయకూడదు.