|
|
|
అధ్యాయం 2- పల్నాటి వీరభారతం
పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి.
రాజవిలాసాల్లో ముఖ్యమైనది - వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు.
పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి.
ఇప్పుడు "అనుగురాజు"కు కావల్సింది కాసేపు విశ్రాంతి, మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తనకోసం చలువ పందిళ్ళు వేసి, విశ్రాంతికి విడిది చూపించినవాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారమూ, అశ్వాలూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.
అప్పటికి నాగమాంబకు పద్ధెనిమిదేళ్ళు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని పదమూడో ఏట పెళ్ళి చేసుకున్నది. కానీ కాలం కాటంది, సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే - నాగమాంబ బాలవితంతువైంది. పంటరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ "నాగమ్మ" అయింది.
తనకు ఇన్ని సపర్యలు చేసిన మనిషి "స్త్రీ"అనీ, శివభక్తురాలనీ, వేదవేదాంగాల్లో నిష్ణాతురాలైన "నాగమ్మ"యనీ తెలుసుకున్న అల్పసంతోషి అనుగురాజు చాలా సంతోషపడి...
"నీ సపర్యలకు మెచ్చాను నాగమాంబా! నీకేం కావాలో కోరుకో" అన్నాడు.
నాగమ్మ సవినయంగా చేతులు జోడించి--
"ప్రభూ! అన్నీవున్న నాకు చిన్న కోరికున్నది. ప్రభులు అన్యధా భావించకపోతే సెలవిస్తాను" అన్నది.
|
| | |
|
|