|
|
|
మాటామంతి - Juggernaut
కపిలేంద్ర మహారాజు "భగవంతుడు శ్రీ జగన్నాధస్వామి సేవకుని"గా తనను ప్రకటించుకున్నాడు. ఆనాటి నుండీ జగన్నాథ రథ మహోత్సవము నాడు ఒక ఆచారము పాటించబడసాగినది. రాజవంశీకులు బంగారు చీపురుతో స్థలాన్ని శుభ్రము చేస్తారు. ఈ సాంప్రదాయ పర్వమును "chhehra panhara" అని పిలుస్తారు. జగన్నాధ దేవళము, రథములు అన్నీ అతి పెద్దవి. అలాగే ఇచ్చట ప్రసాదములను తయారు చేసే వంటిల్లు చాలా పెద్దది. పూరీ దేవాలయ సింహద్వారమునకు ఎడమవైపు ఉన్న kitchen సముదాయంలో 32 గదులు, 752 పొయ్యిలు కలవు. 500 మంది పాకశాస్త్ర ప్రవీణులు, 300 మంది అసిస్టెంటు వంటవాళ్ళు నిత్యము బిజీగా ఉంటారు.
ఇక్కడ 100 రకములైన ఆహారపదార్ధాలను వండుతారు. భగవంతునికి. కేవలము మట్టితో చేసినట్టి (అంటే బట్టీలో కుమ్మరి ఆవము కాల్చనివి) కుండలలో వండుతారు, నాలుగు, ఐదు గంటలసేపు ఆ కుంభములలోని వంటకములు వేడిగానూ, మిక్కిలి రుచిగానూ ఉంటాయి. ప్రసాదములకు మహాప్రసాద/అభద అని పేర్లు. దేవతామూర్తులకు ప్రతిరోజూ 6 సార్లు నైవేద్య నివేదనలు జరుగుతాయి . Juggernaut అనే పదము ఆ నాడు వాడుకలోనికి తమాషాగా వచ్చినది. "జగన్నాథ్" అనే మాటకు వికృతి ఇది.
ఆనాటి పాలకులైన బ్రిటీష్ వారు ఉత్కళ రాష్ట్రములోని పూరీని వీక్షించారు. నయనానందకరమైన వేడుకలను తిలకించి అచ్చెరువందారు. చూడటానికి వేయి కన్నులు చాలని రీతిగా జరుగుతూన్న ఇచ్చటి ఘనమైన గుడులూ, రథములూ, ఊరేగింపులూ వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి. అప్పటి నుండీ "రాసిలోనూ, వాసిలోనూ, అలాగే ఇతర వ్యవహారాలనూ "అతి ఘనమైన" వాటిని ఆంగ్లేయులు "జగన్నాథ్"అని వ్యవహరించ సాగారు. వారికి సరిగ్గా నోరు తిరగక, ఉచ్ఛారణలో అది కాస్తా " జగనాట్"(juggernaut)గా మారిపోయింది. అదన్న మాట ఆ "మాట" యొక్క సంగతి. |
| | |
|
|