బహుభార్యాత్వం, బహుభర్తృత్వం అమల్లో ఉన్న రోజుల్లో స్త్రీలను కాల్చివేసే అవసరం ఏమొచ్చింది? తమ గుంపు (కులం) అభివృద్ధి చెందాలనుకునేవారు ఎవరూ తమ స్త్రీలను వదిలించుకోవాలని చూడరు.
పురాణంలోని హరిశ్చంద్రుని ప్రస్తావిస్తూ అంబేద్కర్ భావనలుగా రచయిత్రి అంటారు "విశ్వామిత్రుడు తీసుకువచ్చిన మాతంగ కన్యలను, కులం తక్కువనే నెపంతో హరిశ్చంద్రుడు వివాహం చేసుకోటానికి సమ్మతించలేదు" అని. ఎంత దారుణమైన ఆరోపణ. ఇంకా, "అందరూ భావించేటట్లు హరిశ్చంద్రుని కథలో ముఖ్యాంశం సత్యవాక్పరిపాలన కాదు, కులకట్టుబాటు" అంటారు రచయిత్రి. ఎంత వక్రీకరణ.
హరిశ్చంద్రుడు ఒక మామూలు రాజుగా ఉండి, నాలుగైదు వివాహాలు చేసుకొని, తన సౌఖ్యం తాను చూసుకొని జీవించినవాడైతే, ఈరోజు ఆ మహాపురుషుణ్ణి గూర్చి మనం చెప్పుకోటానికి ఏమీ మిగిలి ఉండేది కాదు కదా! హరిశ్చంద్రునికి వివాహమై, పది పన్నెండు సంవత్సరాల వయసున్న కుమారుడు కూడా ఉన్న స్థితిలో, విశ్వామిత్రుడు మాతంగకన్యలను హరిశ్చంద్రుని వద్దకు తీసుకు వచ్చి వివాహం చేసుకోమనే వరకూ, ఆయన మరో స్త్రీ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు ఏ పురాణంలోనూ లేవు.